లాస్ట్ ఇయర్ తన కెరీర్లోనే బెస్ట్ సినిమాతో సరికొత్త రికార్డు సృష్టించిన టాలీవుడ్ స్టార్ హీరో... ఈ సారి సినిమా మొదలు పెట్టక ముందే రికార్డు క్రియేట్ చేస్తున్నాడట. ఎవరా హీరో? ఎంటా సినిమా?
'జనతా గ్యారేజ్' సక్సెస్తో జోష్ మీదున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్... ఎవరూ ఊహించని విధంగా బాబీ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. రీసెంట్గా షూటింగ్ మొదలైన ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది సినిమా యూనిట్. ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తుండటం... అందులో ఒకటి నెగటివ్ రోల్ అనే టాక్ రావడంతో మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇదిలా ఉంటే ఆరంభానికి ముందే ఈ సినిమాను ఓ భారీ ఆఫర్ పలకరించినట్టు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా థియెట్రికల్ రైట్స్ను ఏకంగా 85 కోట్లకు కొనుగోలు చేయడానికి ఓ బడా నిర్మాత ముందుకొచ్చాడట. ఈ మేరకు కళ్యాణ్ రామ్తో సదరు నిర్మాత చర్చలు కూడా జరిపినట్టు టాక్. కావాలంటే మరో ఐదు కోట్లు ఎక్కువగా ఇవ్వడానికి కూడా ఆయన సుముఖంగా ఉన్నాడట. అయితే కళ్యాణ్రామ్ మాత్రం ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు.
ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' దాదాపు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో తారక్ నయా మూవీ ఈ రేంజ్లో రేటు పలుకుతోందని కొందరు చర్చించుకుంటున్నారు. ఈ మధ్య ఎరాస్ వంటి సంస్థలు సినిమాను గంపగుత్తగా కొనేస్తుండటంతో వారితో పోటీపడేందుకు కొందరు నిర్మాతలు ముందుగానే జాగ్రత్త పడుతున్నారని సమాచారం. ఏదేమైనా ఎన్టీఆర్ నయా మూవీ బిజినెస్ కాస్త అటు ఇటుగా వంద కోట్లకు దగ్గరగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సినిమా అంతకు మించి వసూళ్ళను సాధిస్తుందేమో చూద్దాం...